మావోయిస్టుల కదలికలు జోరందుకున్నాయా? ఒడిషా, జార్ఖండ్ రాష్ట్రాల్లో మావోలకు ఎదురుదెబ్బలు తగలడంతో ఇటు వైపు ఫోకస్ చేసినట్టు కనిపిస్తోంది..
అల్లూరి సీతారామరాజు జిల్లాలో మావోయిస్టులు రెచ్చిపోయారు. చింతూరు ఏజెన్సీలో మావోయిస్టుల దుశ్చర్యకు పాల్పడ్డారు. జాతీయ రహదారిపై వెళ్తున్న కారును తగుల బెట్టారు. కారులోని ప్రయాణీకులను దించి వేసి కారుకు నిప్పు పెట్టారు. మావోయిస్టుల చర్యలను ప్రత్యక్షంగా చూసిన కారులోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు.
తగలబడిన కారు చింతూరు నుండి భద్రాచలం వైపు వెళ్తోంది. 30వ నెంబరు జాతీయ రహదారి సరివెల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈనెల 2 నుండి 9 వరకు మావోయిస్టులు వారోత్సవాలకు పిలుపు నిచ్చారు. ఇందులో భాగంగానే ఈ దుశ్చర్యకు పాల్పడినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. సమాచారాన్ని అందుకున్న వెంటనే పోలీసులు ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు..

