భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజు పేట,జగదీశ్ కాలనీల్లో భద్రాచలం పోలీసుల ఆధ్వర్యంలో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం
నేటి వారధి న్యూస్ (ప్రతినిధి)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఎస్పీ రోహిత్ రాజు ఆదేశాల మేరకు భద్రాచలం ఏఎస్పీ విక్రాంత్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో శనివారం భద్రాచలం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజుపేట,జగదీశ్ కాలనీల్లో కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం ను నిర్వహించారు.ఇందులో భాగంగా మొత్తం సుమారుగా 300 ఇండ్లలో సోదాలు నిర్వహించి సరిగా పత్రాలు లేకుండా నెంబర్ ప్లేట్లు లేని 66 ద్విచక్ర వాహనాలను,05 ఆటోలను,ఒక ట్రాలీను సీజ్ చేయడం జరిగింది.అంతేకాకుండా 85 లీటర్ల అక్రమ మద్యాన్ని స్వాదీనం చేసుకుని,సంభంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.అనంతరం కాలనీ వాసులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఏఎస్పీ విక్రాంత్ పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట వ్యతిరేక,అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.తమ ప్రాంతంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తమ దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు.మట్కా,జూదం,కోడిపందాలు,బెట్టింగ్,గంజాయి రవాణా వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేయడమైనదన్నారు.అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తుల సమాచారం తెలిపిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలియజేసారు.విపత్కర సమయాల్లో ఆపదలో ఉన్నప్పుడు డయల్ 100 నకు ఫోన్ చేసి పోలీస్ వారి సేవలను పొందాలని సూచించారు.సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.నేరాల నియంత్రణ కొరకు తమ నివాస ప్రాంతాలలో సీసి కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.సుమారుగా 100 మందికి పైగా పోలీస్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.భద్రాచలం ఇన్స్పెక్టర్ నాగరాజు,ఎస్సైలు తిరుపతి,స్వప్న,సతీష్,శ్యామ్,సీఆర్పిఎఫ్ అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.

