జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
నేటి వారధి న్యూస్ ప్రతినిధి, మంచిర్యాల జిల్లా ఆహార భద్రత విషయంలో ప్రతి ఒక్కరు నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురువారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి ఆహార భద్రత శాఖ అధికారి వాసురాం, ఇతర అధికారులతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, ఆహార భద్రత ప్రమాణాలను అందరూ పాటించాలని తెలిపారు. ప్రభుత్వ విద్యాసంస్థలలో విద్యార్థులకు అందించే ఆహార నాణ్యతను ఆహార భద్రతా శాఖ అధికారులు పరీక్షించాలని తెలిపారు. ఆహార సంబంధిత వివిధ వ్యాపార సంస్థలలో కాల పరిమితి ముగిసిన ఆహార పదార్థాలు లభించినట్లయితే పూర్తి వివరాలతో నివేదిక అందించాలని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అంగన్వాడీ టీచర్లు తమ కేంద్రంలో పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం పౌష్టిక ఆహారం అందించాలని, పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని తెలిపారు. అనంతరం అంగన్వాడీ టీచర్లకు ఎఫ్ఎస్ఎస్ఎఐ నమోదు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

