అధికారుల అండతోనే అక్రమాలుకొనసాగుతున్నాయి అంటూ ఎడ్ల శ్రీను ఆరోపణలు
నేటి వారధి న్యూస్ ప్రతినిధి
మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం గొల్లచర్ల గ్రామ పంచాయతీ శివారులో సంవత్సరాలుగా కొనసాగుతున్న అక్రమ ఇటుక బట్టీల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండానే చెరువులు, కుంటలు, సాగుభూముల నుంచి భారీ ఎత్తున మట్టిని తవ్వుతూ ఇటుక బట్టీలు నిర్వహిస్తున్నారని బహుజన సమాజ్ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎడ్ల శ్రీను ఆరోపించారు. ఈ అక్రమాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోవడమే కాకుండా రైతులు, గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
గత ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలుగా కొనసాగుతున్న ఈ అక్రమ తవ్వకాల కారణంగా గ్రామ పరిసర ప్రాంతాల్లో బోర్లు ఎండిపోతున్నాయని, సాగునీటి సమస్య రోజురోజుకు తీవ్రమవుతోందని తెలిపారు. వేసవి కాలంలో తాగునీటి కోసం ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత శాఖలు స్పందించకపోవడం అనుమానాలకు తావిస్తోందన్నారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రభుత్వం ప్రచారం చేస్తూనే నేలమట్టం స్థాయిలో జరుగుతున్న పర్యావరణ విధ్వంసాన్ని అడ్డుకోవడంలో పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
అక్రమ ఇటుక బట్టీల నిర్వాహకులు గ్రామ పంచాయతీ, రెవెన్యూ శాఖలకు చెల్లించాల్సిన ఫీజులు ఎగ్గొట్టి ప్రభుత్వ ఖజానాకు కోట్ల రూపాయల నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. చెరువుల మట్టి, వ్యవసాయ భూముల ఉపరితల మట్టిని అక్రమంగా తరలించడం వల్ల భవిష్యత్ తరాలకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి ఏర్పడిందన్నారు. దుమ్ము, పొగ కాలుష్యం కారణంగా గ్రామ ప్రజలు శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారని తెలిపారు.ఈ అక్రమ దందా వెనుక కొందరు ప్రభావశీలులు, రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా ఒక పోలీసు అధికారికి సంబంధించిన గన్మెన్ కూడా ఉన్నట్లు స్థానికంగా ప్రచారం జరుగుతోందని ఎడ్ల శ్రీను సంచలన ఆరోపణలు చేశారు. సంబంధిత శాఖలు స్పందించకపోవడం వెనుక అధికార–రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. ప్రజల జీవన హక్కులను కాపాడాల్సిన బాధ్యత ఉన్న అధికారులు అక్రమార్కులకు అండగా నిలిస్తే ప్రజలు న్యాయం కోసం ఎవరిని ఆశ్రయించాలని ప్రశ్నించారు.
జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వెంటనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి అక్రమ ఇటుక బట్టీలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. చెరువులు, కుంటల మట్టి అక్రమ తవ్వకాలపై కేసులు నమోదు చేయడంతో పాటు పర్యావరణ నష్టం అంచనా నివేదిక విడుదల చేయాలని కోరారు. ప్రభుత్వ ఆదాయ నష్టాన్ని లెక్కించి బాధ్యులపై నిర్బంధ చట్టం సహా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రజల భవిష్యత్తు, భూగర్భ జలాలు, వ్యవసాయ భూములను కాపాడటంలో ప్రభుత్వం విఫలమైతే బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ప్రజా ఉద్యమాలు, ఆందోళనలు చేపడతామని ఎడ్ల శ్రీను హెచ్చరించారు.

