పరిశుభ్రత, నిర్వహణలో నిర్లక్ష్యం సహించేది లేదు
కంప్యూటర్ ఇన్స్పెక్టర్ కాంట్రాక్టర్ రద్దు మెనూ అమలలో నిర్లక్ష్యం వార్డెన్ కు మెమో జారీ
నేటి వారధి న్యూస్ ప్రతినిధి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలో జిల్లా కలెక్టర్ అంకిత్ విస్తృతంగా పర్యటించారు, గొందిగూడెం గిరిజన ఆశ్రమ గురుకుల బాలుర పాఠశాలను జిల్లా కలెక్టర్ అంకిత్, భద్రాచలం సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల, పాఠశాల ఆవరణను పరిశీలించారు.కంప్యూటర్ ల్యాబ్లో కంప్యూటర్లు దుమ్ము, ధూళితో అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు నెలల క్రితం పాఠశాల సందర్శన సందర్భంగా ఇదే అంశంపై సూచనలు చేసినప్పటికీ పరిస్థితిలో మార్పు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు సాంకేతిక పరిజ్ఞానం అందించేందుకు లక్షల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ను సక్రమంగా నిర్వహించకపోవడం బాధాకరమన్నారు. ఈ విషయమై సంబంధిత సీటీవోతో ఫోన్లో మాట్లాడి కంప్యూటర్ ఇన్స్పెక్టర్ కాంట్రాక్టును రద్దు చేయాలని ఆదేశించారు.ప్రధానోపాధ్యాయుని గది, వంటశాలను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు వడ్డించటానికి సిద్ధంగా ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించి,ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించడం లేదని గుర్తించి హాస్టల్ వార్డెన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య ఎంత ఉన్నప్పటికీ ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలు చేయాలన్నారు. వసతి గృహాలను తనిఖీ చేసిన పరిశుభ్రత లోపాలను గమనించి అసంతృప్తి వ్యక్తం చేశారు.ప్రధానోపాధ్యాయులు, సిబ్బందితో మాట్లాడుతూ ప్రధానోపాధ్యాయుని గది మినహా పాఠశాలలోని మిగతా అన్ని ప్రాంతాల్లో పరిశుభ్రత లోపించిందని అసహనం వ్యక్తం చేశారు,పాఠశాల ఆవరణ, తరగతి గదులు, వసతి గృహాలు, వంటశాల తదితర ప్రాంతాల్లో 24 గంటల్లో పూర్తిస్థాయిలో పరిశుభ్రత చర్యలు చేపట్టి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. పరిశుభ్రత లోపాలు, మెనూ అమలులో నిర్లక్ష్యంపై హాస్టల్ వార్డెన్కు మెమో జారీ చేయాలని ఆదేశించారు.

