జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు
నేటి వారధి న్యూస్ ప్రతినిధి, మంచిర్యాల జిల్లా సాదా బైనామా దరఖాస్తులను క్షేత్రస్థాయిలో విచారణ చేసి, రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు తెలిపారు. గురువారం జిల్లాలోని జన్నారం, దండేపల్లి, లక్షెట్టిపేట మండలాలలోని తహశీల్దార్ కార్యాలయాలను సందర్శించి సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారం, భూభారతి పెండింగ్ దరఖాస్తులు, ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి రాములు మాట్లాడుతూ సాదా బైనమా దరఖాస్తుల పరిష్కరణలో భాగంగా క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమంలో భాగంగా భూ సమస్యలను త్వరితగతిన పరిష్కరించడానికి భూభారతి పోర్టల్ ను అందుబాటులోకి తీసుకువచ్చి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్, విరాసత్ తదితర సేవల ద్వారా నిబంధనల ప్రకారం భూ సంబంధిత సేవలను వేగవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 25వ తేదీ నుంచి కార్యక్రమం నిర్వహించనున్న దృష్ట్యా ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలని, ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా సక్రమంగా నిర్వహించాలని, బూత్ స్థాయి అధికారులు ప్రతి ఇంటికి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని, సూపర్వైజర్లు, ఎఈఆర్ఓలు పనుల పురోగతిని పరిశీలించాలని తెలిపారు. ఈ క్రమంలో పెండింగ్ లో ఉన్న దరఖాస్తుల పరిష్కరణ వేగవంతం చేయాలని తెలిపారు. కార్యాలయ సిబ్బంది సమయపాలన పాటించాలని, కార్యాలయానికి వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని, సర్టిఫికెట్లను నిబంధనలకు లోబడి నిర్ణీత గడువులోగా జారీ చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

